
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాల్ని అందించిన జీఏ2 పిక్చర్స్ తాజాగా నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం `చావు కబురు చల్లగా`. `Rx100` సినిమాతో సంచలనం సృష్టించిన కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ మూవీ మేకర్స్ ఫస్ట్ సాంగ్ `కదిలే కళ్లనడిగా..` అంటూ సాగే లిరికల్ వీడియోని మంగళవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ `ఈ సినిమాకు తగ్గట్లు చావు కబురు చల్లగా అనే టైటిల్ను లాక్ చెయ్యడం జరిగింది. హీరో డెడ్ బాడీస్ని పికప్ చేసుకునే మార్చురీ వ్యాన్ డ్రైవర్.. హీరోయిన్ నర్స్గా కనిపిస్తారు. ఇదొక లవ్స్టోరీ, సీరియస్ పాయింట్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం జరిగింది. సినిమాలో అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. ఆడియన్స్కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో వున్నాయి` అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ `కథ పరంగా మంచి సినిమా చెయ్యాలని అనుకుంటున్న సమయంలో కౌశిక్ చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఫ్రెష్ కంటెంట్ తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశాను. అనుకుంటున్నట్టుగా డైరెక్టర్ సినిమా తీశాడు. కార్తికేయ, లావణ్య ఇద్దరూ ఈ కథకు పూర్తి న్యాయం చేశారు. యంగ్ టీమ్ చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను` అన్నారు.