
`సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో ఈ ఏడాది సంక్రాంతి విజయాన్ని సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమాతో దాదాపు వంద కోట్ల క్లబ్లో చేరిన మహేష్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే మహేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కార్తి హీరోగా నటించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ `ఖైదీ`. హీరోయిన్ లేకుండా, హీరోని సినిమా మొత్తం కేవలం ఒకే ఒక్క డ్రెస్లో అదీనూ చిరిగిపోయిన షర్ట్, లుంగీలో చూపించిన తీరు, కథ, కథనం, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, కార్తీ నటన వెరసి `ఖైదీ` చిత్రాన్ని ట్రెంట్ సెట్టర్గా నిలిపింది.
ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ అనే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయమయ్యారు. ప్రస్తుతం హీరో విజయ్తో `మాస్టర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్తో సినిమా చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట. ఇప్పటికే మహేష్తో మైత్రీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.